టీటీడీ స్థానికాలయాల్లో ప్రారంభమైన వార్షిక లెక్కలు

తిరుపతి శ్రీ గోవింద రాజస్వామి ఆలయం, శ్రీ కోదండరామాలయంలో మంగళవారం సాయంత్రం ఆణివార ఆస్థానం శాస్త్రోక్తంగా జరిగింది. ఆణిమాసం చివరి రోజున నిర్వహించే కొలువు కావడంతో దీనికి ఆణివార ఆస్థానం అని పేరు. పూర్వం మహంతులు దేవస్థాన పరిపాలనను స్వీకరించిన రోజు అయిన ఈ ఆణివార ఆస్థానం పర్వదినం నాటి నుంచి టీటీడీ వారి ఆదాయ వ్యయాలు, నిల్వలు, వార్షిక లెక్కలు ప్రారంభమయ్యేవి. టీటీడీ ధర్మకర్తల మండలి ఏర్పడిన తరువాత వార్షిక బడ్జెట్‌ను మార్చి – ఏప్రిల్‌ నెలలకు మార్చారు.

శ్రీ గోవింద‌రాజ‌స్వామివారి ఆల‌యం

శ్రీ గోవింద‌రాజ‌స్వామివారి ఆల‌యంలోని బంగారు వాకిలి వ‌ద్ద శ్రీ‌దేవి, భూదేవి స‌మేత శ్రీ గోవింద‌రాజ‌స్వామివారిని వేంచేపు చేసి సాయంత్రం 5.30 నుండి రాత్రి 7 గంట‌ల వ‌ర‌కు ఆస్థానం నిర్వహించారు. ఈ సంద‌ర్భంగా శ్రీ పుండ‌రీక వ‌ల్లి అమ్మవారి ఆల‌యం నుంచి నూత‌న వ‌స్త్రాల‌ను విమాన ప్రద‌క్షణ‌గా తీసుకువ‌చ్చి శ్రీ గోవింద‌రాజ‌స్వామివారికి స‌మ‌ర్పించారు. ఈ కార్యక్రమంలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్‌ స్వామి, డిప్యూటీ ఈవో శ్రీమతి శాంతి, ఏఈవో శ్రీ మునికృష్ణ రెడ్డి, సూప‌రింటెండెంట్ శ్రీ మోహన్ రావు, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్ శ్రీ ధనంజయ, త‌దిత‌రులు పాల్గొన్నారు.

శ్రీ కోదండరామాలయంలో

శ్రీ కోదండరామాలయంలో సోమవారం సాయంత్రం 4 నుండి 5 గంట‌ల వ‌ర‌కుఆలయంలోని గరుడాళ్వార్‌ ఎదురుగా శ్రీ సీతా లక్ష్మణ సమేత కోదండరాములవారి ఉత్సవమూర్తులను వేంచేపు చేసి ప్రత్యేకంగా ఆస్థానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్‌ స్వామి, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి నాగ‌ర‌త్న‌, సూపరింటెండెంట్‌ శ్రీ సోమశేఖర్, టెంపుల్ ఇన్స్పెక్టర్లు శ్రీ సురేష్, శ్రీ చలపతి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Share this post with your friends