తిరుమల శ్రీవారి దర్శనమంటే వ్యయ ప్రయాసలతో కూడుకున్నది. ఏదో ఒకరకంగా తిరుమలకు చేరుకున్నా కూడా అక్కడ రూమ్ దొరకడం చాలా కష్టం. ఇక దర్శనం మరీ కష్టం. నానా తంటాలు పడితే కానీ కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి కనిపించరు. ఒక్కోసారి ఆ క్యూలైన్లలోనే భగవంతుడు కనిపిస్తూ ఉంటాడు. ఇక ఇలాంటి తంటాలేమీ లేకుండానే కొందరికి స్వామివారి దర్శన భాగ్యం లభించనుంది. అది కూడా ప్రతి మంగళవారం. వారెంత అదృష్టవంతులో అనిపిస్తోంది కదా.
ఇంతకీ వారెవరు.. అంటారా? తిరుమలలో ఉండే స్థానికులు. తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి ఏర్పాటైన తర్వాత నుంచి వీరికి ఈ భాగ్యం కలిగే అవకాశం ఉంది. ఈ విషయాన్ని తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు తెలిపారు. ఇప్పటికే ఈ విషయాన్ని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ దృష్టికి తీసుకెళ్లినట్టుగా వెల్లడించారు. త్వరలోనే ఈ విషయంపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని తెలిపారు. అలాగే శ్రీవాణి, దర్శనాల విషయమై జరుగుతున్న అవినీతికి కూడా చెక్ పెట్టేందుకు చర్యలు తీసుకోనున్నట్టు తెలిపారు.