శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రారంభమైన కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం

శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయంలో ఇవాళ ఉదయం కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం ప్రారంభమైంది. శ్రీవారి సాలకట్ల సాక్షాత్కార వైభవోత్సవాలు జూలై 10 నుంచి ప్రారంభం కానున్నాయి. 12వ తేదీ వరకూ బ్రహ్మోత్సవాలు కొనసాగనున్నాయి. ఈ ఉత్సవానికి ముందు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ. కాబట్టి ఇవాళ ఉదయం తెల్లవారుజామున సుప్రభాతంతో స్వామివారిని ఆలయ అర్చకులు మేల్కొల్పారు. అనంతరం తోమాలసేవ, కొలువు, పంచాంగశ్రవణం నిర్వహించారు. ఉదయం 6. 30 నుంచి ప్రారంభమైన ఈ కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం 11.30 గంటల వరకూ నిర్వహిస్తారు.

కోయిల్ ఆళ్వార్ తిరుమంజనంలో భాగంగా శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర అన్ని వస్తువులను నీటితో శుద్ధి చేస్తారు. అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలీగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర జలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేస్తారు. ఇక కార్యక్రమాలన్నీ ముగిసిన మీదట మ‌ధ్యాహ్నం 12.30 గంటల నుంచి భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. ఇవాళ కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహిస్తున్న నేపథ్యంలో తిరుప్పావడసేవ, ఆర్జిత కల్యాణోత్సవం సేవలను తిరుమల తిరుపతి దేవస్థానం రద్దు చేసింది.

Share this post with your friends