తెప్పపై శ్రీ పద్మావతి అమ్మవారి అభయం..

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి తెప్పోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. మొదటి రెండు రోజులు రుక్మిణి, సత్యభామ సమేత శ్రీకృష్ణ స్వామి, సుందరరాజస్వామి వారు విహరించారు. ఆ తరువాత నుంచి పద్మావతి అమ్మవారు తెప్పపై విహరిస్తున్నారు. గురువారం అమ్మవారు తెప్పపై విహరించి భక్తులకు అభయమిచ్చారు. ఈ తెప్పోత్సవాల్లో భాగంగా ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి, సహస్రనామార్చన, నిత్యార్చన నిర్వహించారు. మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు పద్మ పుష్కరిణి వద్ద గల నీరాడ మండపంలో అమ్మవారికి అభిషేకం నిర్వహించారు.

సాయంత్రం 6.30 గంటలకు తెప్పోత్సవం వైభవంగా జరిగింది. ఇందులో అమ్మవారు ఐదు చుట్లు తిరిగి భక్తులకు దర్శనమిచ్చారు. అనంతరం సిరుల తల్లి గజవాహనంపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులను కటాక్షించారు. తెప్పోత్సవాల్లో ఆలయ డిప్యూటీ ఈవో శ్రీ గోవిందరాజన్, సూపరింటెండెంట్ శ్రీ మధు, ఆలయ అర్చకులు శ్రీ బాబు స్వామి, టెంపుల్ ఇన్స్పెక్టర్లు శ్రీ సుభాష్, శ్రీ గణేష్, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. కాగా ఇవాళ రాత్రి 8.30 గంటలకు పద్మావతి అమ్మవారికి గరుడ వాహనసేవ నిర్వహిస్తారు. తెప్పోత్సవం అనంతరం ప్రతిరోజు ఆలయ మాడ వీధుల్లో అమ్మవారి ఊరేగింపు నిర్వహిస్తారు.

Share this post with your friends