నారాయణవనం శ్రీ చంపకవల్లి సమేత శ్రీ పరాశరేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం

నారాయణవనం శ్రీ చంపకవల్లి సమేత శ్రీ పరాశరేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ఇవాళ ఉదయం ప్రారంభమయ్యాయి. జూలై14వ తేదీ వరకూ ఈ బ్రహ్మోత్సవాలు వైభవంగా జరగనున్నాయి. జూలై 3వ తేదీ సాయంత్రమే ఈ బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరిగింది. ఇక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఇవాళ ఉదయం 5.45 నుంచి 6.45 గంటల వరకు మిథున లగ్నంలో ధ్వజారోహణం, సాయంత్రం చంద్రప్రభ వాహనసేవ నిర్వహించారు. ఉత్సవాల్లో ప్రతిరోజు ఉదయం 8.30 గంటలకు తిరుచ్చి ఉత్సవం, ఉదయం 10 నుంచి 11 గంటల వరకు స్వామి అమ్మవారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం, రాత్రి 7 నుంచి 9 గంటల వరకు స్వామివారు వాహన సేవల్లో భక్తులకు దర్శనమివ్వనున్నారు.

జూలై 6వ తేదీ నుంచి స్వామివారికి వివిధ వాహన సేవలు నిర్వహించనున్నారు. సింహ వాహనం, జూలై 7న హంస వాహనం, జూలై 8న శేష వాహనం, జూలై 9న నంది వాహనం, జూలై 10న గజ వాహనాలపై ఊరేగి స్వామివారు భక్తులకు కనువిందు చేయనున్నారు. అదేవిధంగా జూలై 11వ తేదీన రథోత్సవం జరుగనుంది. జూలై 12వ తేదీన సాయంత్రం 6.30 నుండి రాత్రి 8.30 గంటల వరకు స్వామి, అమ్మవార్ల కల్యాణోత్సవం, అనంతరం అశ్వ వాహనసేవ నిర్వహించనున్నారు. జూలై 13న ఉదయం 9.30 నుంచి 10.30 గంటల వరకు నటరాజస్వామివారి ఉత్సవం, రాత్రి రావణేశ్వర వాహనసేవ జరుగనున్నాయి. జూలై 14వ తేదీన ఉదయం 11 గంటలకు త్రిశూలస్నానం నిర్వహించనున్నారు. అదేరోజు రాత్రి ధ్వజావరోహణంతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి.

Share this post with your friends