హనుమంతుడి భక్తికి కొలమానం లేదు. ఒక్క భక్తి పేరు చెప్పి ఆయనను సులభంగా మాయ చేయవచ్చు. అలా సముద్రుడు మాయ చేశాడు. వెరసి హనుమంతుడికి సంకెళ్లు పడ్డాయి. ఇదెక్కడంటే.. ఒడిశాలో పురీ జగన్నాథుని క్షేత్రంలో. ఈ ఆలయ సముదాయంలో హనుమంతుడి ఆలయం ఉంటుంది. అసలు ఈ ఆలయాన్ని రక్షించేదే హనుమంతుడని చెబుతారు. జగన్నాథుడు పూరికి వచ్చిన తర్వాత దేవతంతా ఆయన దర్శనం చేసుకోవాలని వచ్చారట. అంతమంది స్వామివారి దర్శనానికి వెళ్లడం చూసిన సముద్రుడు.. తను కూడా దర్శించుకోవాలనుకున్నాడట. దీంతో ప్రయత్నాల మీద ప్రయత్నాలు చేశాడట. అప్పుడు ఆలయంతో పాుట భక్తులకు చాలా నష్టం వాటిల్లిందట. అయినా సరే జగన్నాథుని దర్శన భాగ్యమైతే సముద్రుడికి దక్కలేదట. అయినా ప్రయత్నిస్తూనే ఉన్నాడట.
ఇక లాభం లేదనుకున్న జగన్నాథుడు సముద్రుడిని కంట్రోల్ చేయడానికి హనుమంతుడిని నియమించాడట. దీంతో హనుమతుడు సముద్రుడిని బంధించేసి పూరీని చాలా ప్రశాంతంగా ఉంచాడు. దీంతో సముద్రుడికి ఆలయంలోకి వెళ్లేందుకు అవకాశమే లేకుండా పోయింది. చాలా తెలివిగా హనుమంతుడిని బురిడీ కొట్టించాడట. జగన్నాథుడిని దర్శించుకోని నీవేం భక్తుడివంటూ మాటలతో మాయ చేశాడట. నిజమేనని నమ్మిన హనుమంతుడు జగన్నాథుని దర్శించుకునేందుకు వెళ్లాడట. అదే తగిన సమయని భావించిన సముద్రుడు హనుమంతుడిని అనుసరించాడట. దీంతో ఆలయం, జనాలకు తీవ్ర నష్టం వాటిల్లింది. హనుమంతుడి భక్తే కొంప ముంచుతోందని భావించిన జగన్నాథుడు ఆయనను కదలనివ్వకుండా గొలుసులతో బంధించేశాడట. ఇది పూరిలోని బేడి హనుమంతుడి కథ.