ఇవాళ యోగిని ఏకాదశి. కాబట్టి ఇవాళ యోగిని ఏకాదశి వ్రతం చేసుకుంటే చాలా మంచిదట. మరి ఆ వ్రత కథ గురించి తెలుసా? పాండవ అగ్రజుడు ధర్మరాజుకు శ్రీకృష్ణ పరమాత్ముడు ఈ వ్రత కథను తెలిపాడట. పరమ శివ భక్తుడైన కుబేరుడు అల్కాపురిని పాలించేవాడు. హేమాలి అనే కుబేరుడి సేవకుడు ప్రతిరోజూ కుబేరుని నిత్య పూజ కోసం మానస సరోవరం నుంచి దేవతా పుష్పాలను తీసుకొస్తూ ఉండేవాడట. అయితే ఒకరోజు హేమాలి తన భార్య మోజులో పడి పూల విషయమే మరచిపోయాడట. కుబేరుడికి పూజకు వేళవుతోంది అయినా కూడా పూలు రాలేదు. దీంతో ఆగ్రహించిన కుబేరుడు భగవంతుని పూజ విషయంలోనే నిర్లక్ష్యం వహిస్తావా? అని శపించాడట.
కుబేరుని శాపం ఫలితంగా హేమాలి భార్యకు దూరమైపోయాడట. పైగా కుష్టు వ్యాధిగ్రస్తుడై భూలోకానికి చేరుకున్నాడట. అక్కడ మార్కండేయ మహర్షికి తన కష్టం చెప్పుకున్నాడట. తనకు శాప విమోచన మార్గాన్ని సూచించమని అర్థించాడట. అప్పుడు మార్కండేయ మహర్షి యోగిని ఏకాదశి రోజు ఉపవాసం చేయాలని సూచించాడట. ఈ వ్రతం ఆచరిస్తేసకల పాపాలు తొలగిపోతాయని చెప్పడంతో హేమాలి నియమ నిష్టలతో వ్రతాన్ని ఆచరించాడట. దీంతో అతనికి శాప విమోచనం కలిగిందట. ఈ వ్రతమాచరిస్తే పూర్వ జన్మల పాపాలు కూడా పోతాయని నమ్మకం. ఎలాంటి భయంకరమైన వ్యాధి ఉన్నా కూడా ఈ వ్రతమాచరిస్తే తప్పక నయమవుతుందట.