జులై నెలలో ఆషాడ పౌర్ణమి రోజున సింహాచలంలో గిరి ప్రదక్షిణ వైభవంగా జరుగుతూ ఉంటుంది. సింహాద్రి అప్పన్నగా పిలిచే శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం కొండ చుట్టూ భక్తులు పెద్ద ఎత్తున గిరి ప్రదక్షిణ నిర్వహిస్తూ ఉంటారు. ఈ కొండ చుట్టూ దాదాపు 32 కిలో మీటర్లు ఉంటుంది. ఈ నెల ల20వ తేదీన సాయంత్రం 4 గంటలకు గిరి ప్రదక్షిణ ప్రారంభం కానుంది. తొలి పావంచా వద్ద నుంచి పుష్ప రథం ప్రారంభమవుతుంది. ఈ గిరి ప్రదక్షిణ ప్రారంభానికి ముందు ప్రత్యేక పూజలు నిర్వహించి ఆపై ధర్మకర్త, ఆలయ కార్యనిర్వహణాధికారి కొబ్బరికాయ కొట్టి, జెండా ఊపి ప్రారంభిస్తారు. ఉదయం 10 గంటలకు ఈ పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు.
సాయంత్రం 4 గంటలకు భక్తులంతా పుష్పరథంతో పాటు నడుస్తూ గిరి ప్రదక్షిణను ప్రారంభిస్తారు. రథం ముందు వలంటీర్లు నృత్యాలు చేస్తుంటారు. కోలాహలంగా ఈ గిరి ప్రదక్షిణ సాగుతుంది. గిరి ప్రదక్షిణ పూర్తైన అనంతరం మెట్ల మార్గంలో సింహగిరి చేరుకుని స్వామివారిని దర్శించుకుంటారు. ఇక ఆ రోజున రాత్రి 10 గంటల వరకూ స్వామివారి దర్శనానికి భక్తులను అనుమతిస్తారు. 21న అయితే విజయోత్సవం నేపథ్యంలో స్వామివారి దర్శనం సాయంత్రం 4 గంటల వరకూ మాత్రమే ఉంటుంది. గిరి ప్రదర్శన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్, జీవీఎంసీ కమిషనర్ పరిశీలించారు. గిరి ప్రదర్శనకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూడాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.